ఏపీ బీజేపీలో బలమైన నేతగా అధిష్ఠానం అంచనాలున్న పురంధేశ్వరిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమెను రాజ్యసభకు పంపించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారం నిలుపుకొంటే ఆమెను కేంద్రంలో మంత్రిని చేయాలని తలపోస్తున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో కర్ణాటకలో నాలుగు స్థానాలున్నాయి. అందులో ఒక స్థానం పురంధేశ్వరికి కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఆమె లోక్ సభకు పోటీ చేయడానికి సరైన నియోజకవర్గం లేదని భావించడం… ఒకవేళ చంద్రబాబుతో పొత్తు ఉన్నా కూడా టీడీపీ నుంచి ఆమె విషయంలో సరైన సహకారం ఉండకపోవచ్చన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఆమెను రాజ్యసభకు పంపుతున్నట్లు సమాచారం.

ALSO READ:  'Swachh Education For Swachh Hyderabad'

ఆమె నిత్యం వార్తల్లో ఉండడం.. ప్రెస్ మీట్లు పెట్టడం వంటివి ఎక్కువగా లేకపోయినా కూడా పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తున్నారని అధిష్ఠానం గుర్తించిందని.. ఆ మేరకే ఆమెకు ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు టీడీపీతో సంబంధాలపై అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో పురంధేశ్వరి వంటి ఛరిష్మా ఉన్న నేతను, సమర్థురాలిని కేంద్రంలో మంత్రిని చేస్తే అది ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. #KhabarLive